శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (16:00 IST)

ఆశారాం బాపుకు జీవిత శిక్ష - జోథ్‌పూర్ కోర్టు తీర్పు

తన ఆశ్రమానికి వచ్చిన 16 యేళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోథ్‌పూర్ కోర్టు జీవిత కారాగారశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, ఈ కేసులో మరో ఇద్దరు ముద్

తన ఆశ్రమానికి వచ్చిన 16 యేళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోథ్‌పూర్ కోర్టు జీవిత కారాగారశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, ఈ కేసులో మరో ఇద్దరు ముద్దాయిలకు కూడా 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది.
 
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని షాహజాన్‌పూర్‌కు చెందిన 16 యేళ్ల బాలిక అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద ఏడుగురు పోలీసులతో రక్షణ కల్పించారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని షాహజాన్‌పూర్‌కు చెందిన 16 యేళ్ల బాలిక మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటూ వచ్చింది. 
 
ఈ బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు ఒకటో తేదీన ఆశారాంను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 7నే వాదనలు పూర్తికాగా బుధవారం తుది తీర్పును వెలువరించింది. 
 
ఆశారాం బాపు కేసును తొలుత న్యాయస్థానంలోనే విచారణ జరపాలని భావించారు. అయితే, రాం రహీమ్ గుర్మీత్‌ సింగ్ బాబాపై తీర్పు నేపథ్యంలో చోటుచేసుకున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకొని విచారణను జోథ్‌పూర్‌ జైలు ప్రాంగణంలో చేపట్టాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి గత నాలుగేళ్లుగా ఆశారాం ఇదే జైలులో ఉంటున్నాడు. 
 
దీంతో జోథ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ మధుసూదన్‌ శర్మ ఈ కేసు విచారణ జరిపి తుదితీర్పును వెలువరించారు. ఈ తీర్పు మేరకు ఆశారాంకు జీవిత ఖైదు విధించడంతో ఆయన తన మిగతా జీవితం మొత్తం జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఆశారాంకు కనీస శిక్ష మాత్రమే విధించాలని ఆశారాం తరపు న్యాయవాదులు చేసిన వినతిని కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఈ తీర్పుపై పైకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఆశారాం బాపు తరపు న్యాయవాదులు వెల్లడించారు.