1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (11:56 IST)

కిలేశ‌పురం వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద బెజ‌వాడ గ్యాంగ్ వార్!

బెజ‌వాడ‌లో గ్యాంగ్ వార్ సంస్కృతి త‌ర‌చూ త‌లెత్తి చూస్తోంది. గ‌త ఏడాది జూన్ లో ప‌ట‌మ‌ట‌లో పండు గ్యాంగ్ వార్ సంఘ‌ట‌న న‌గ‌ర‌వాసుల‌నే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. సందీప్ అనే యువ‌కుడిని పండు గ్యాంగ్ వార్ లో కొట్టి చంపారు. అప్ప‌ట్లో మ‌ణికంఠ అలియాస్ పండు వికృత చేష్టలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. అందరి వెన్నులో చ‌లిపుట్టించాయి.
 
ఇపుడు తాజాగా విజ‌య‌వాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ సంఘటన హల్చల్ క‌లిగిస్తోంది. కొండ‌ప‌ల్లి వ‌ద్ద కిలేశ‌పురంలోని వాటర్ ఫాల్స్ చూడ‌టానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్క‌డికి వ‌చ్చి ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ, సేద‌తీరాల్సిన యువ‌కులు... త‌మ‌లోతాము గొడ‌వ‌ప‌డి కొట్టుకున్నారు. దొమ్మిలా ఒకరిపై ఒక‌రు ప‌డి త‌న్నుకు చ‌చ్చారు. 
 
కిలేశ‌పురం వాట‌ర్ ఫాల్స్ చూడటానికి విజ‌య‌వాడ నుంచి వ‌చ్చిన యువ‌కులు చివ‌రికి త‌మ మ‌ధ్య జరిగిన గొడవ ఆధారంగా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అక్క‌డే ఉన్న క‌ర్ర‌లు, బాదుల‌తో కొట్టుకోవ‌డంతో వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద ర‌ణ‌రంగ‌మే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ కొట్లాట‌లో చాలా మందికి గాయాలు కాతా, ఒక యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

ఈ గొడ‌వ ప‌డిన గ్యాంగ్ విజయవాడ యువకులే అని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెపుతున్నారు. గ్యాంగ్ వార్‌లో గాయపడిన ఒక యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇబ్ర‌హీంప‌ట్నం పోలీసులు ఈ గ్యాంగ్ వార్ సంఘ‌ట‌న‌పై విచారిస్తున్నారు.