శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (12:53 IST)

కర్ణాటక రాజకీయం రసవత్తరం : ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు?!

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లను భారతీయ జనతా పార్టీ ఆఫర్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, బీజేపీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు అనేకాలుగా ప్రయత్నిస్తున్నాయి.
 
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ సర్కారు ఏర్పాటుకాగా, ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఉన్నారు. ఈ సర్కారును కూలగొట్టేందుకు కమలనాథులు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఇప్పటికే మహారాష్ట్రకు తరలించిన బీజేపీ.. ఇపుడు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి తర్వాత కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, పార్టీ మారడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు బీజేపీ ఆఫర్ చేస్తోందని వారం కిందట కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేల్లో చీలిక తీసుకురావడం కష్టమని భావించిన బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయాలని డిసైడ్ అయిందన్నారు. 
 
అదేసమయంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని, వారిని బీజేపీ నాయకులు ముంబైకు తరలించారని కర్ణాటక కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరున్నమంత్రి డీకే శివకుమార్ చేసిన ఆరోపణతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం తెరపైకి వచ్చింది. కుమారస్వామి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు అరడజనుసార్లు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇపుడు ఈ ఆరోపణలు నిజం చేసేలా కమలనాథులు వ్యూహాలు రచించారు.