గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (10:01 IST)

ప్లీజ్.. సురక్షితంగా రప్పించండి... అభినందన్ ఫ్యామిలీ

పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్, మిగ్ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను ఎలాగైనా సురక్షితంగా దేశానికి తీసుకుని రావాలని అతని కుటుంబం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 
 
భారత రక్షణ స్థావరాలపై దాడులు చేసేందుకు వచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టే ప్రయత్నాల్లో భాగంగా ఒక శత్రుదేశ యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్... తాను నడుపుతున్న మిగ్ జెట్ కుప్పకూలిపోయింది. దీంతో అతను పాక్ భూభాగంలో పడిపోవడంతో పాకిస్థాన్ సైనికులు పట్టుకున్నారు. 
 
ఆ తర్వాత అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో రక్తం ధారగా ప్రవహించింది. ఈ ఫోటోలను టీవీలో చూపించారు. వీటిని చూసిన అభినందన్ ఫ్యామిలీ తట్టుకోలేక పోయింది. చేతులు వెనక్కి కట్టేసి, కళ్లకు గుడ్డ కట్టి వున్న అభినందన్‌ను చూసిన దేశ ప్రజలంతా చలించిపోయారు. 
 
ఈ నేపథ్యంలో జెనీవా ఒప్పందం మేరకు అభినందన్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇదే వినతిని ఆయన కుటుంబ సభ్యులు కూడా చేశారు. దీనిపై అభినందన్ మేనమామ గురునాథన్ స్పందిస్తూ, 'నేను అభి విజువల్స్‌ను టీవీల్లో చూశా. తనను ఈ చేతుల్తో ఎత్తుకుని పెంచా. ప్రభుత్వం ఎలాగైనా తనను వెనక్కు తీసుకురావాలి' అని విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, అభినందన్ సొంతూరు తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా తిరుప్పనూరు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా ఢిల్లీలో నివశిస్తున్నారు. అభినందన్ భార్య తన్వి మోర్వాహా కూడా ఓ మాజీ పైలట్. 
 
ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అభినందన్... తన తండ్రి సింహకుట్టి వర్ధమాన్ బాటలోనే పయనించారు. సింహకుట్టి కూడా ఓ మాజీ పైలట్. ఎయిర్ మార్షల్‌గా పని చేశారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అభినందన్.. చెన్నైలోని తాంబర్ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో శిక్షణ తీసుకున్నారు. సింహకుట్టి వర్ధమాన్ ప్రస్తుతం తాంబరంలోని ఎయిర్‌ఫోర్స్ క్వార్టర్స్‌లో నివశిస్తోంది.