శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (12:32 IST)

పశ్చిమ బెంగాల్ సీఎం మమత దీక్ష.. రాత్రికి రాత్రే ఆ పని చేసేశారు..?

కేంద్రం తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ దీక్షకు దిగారు. ఆదివారం రాత్రి సత్యాగ్రహ ధర్నా చేపట్టిన మమత బెనర్జీ.. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా కమిషనర్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు రావడంపై ఫైర్ అయ్యారు. అంతేగాకుండా రాత్రికి రాత్రే దీక్షకు దిగారు. రాత్రంతా మెలుకునే వుండిన మమత బెనర్జీ.. ఆహారం కూడా తీసుకోలేదు. 
 
దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు, తాను దీక్షకు కూర్చున్న చోటే శాసనసభ కార్యకలాపాలు కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు. కాగా మమత బెనర్జీకి ఈ దీక్ష కొత్త కాదు. 13 సంవత్సరాల క్రితం అప్పటి వామపక్ష ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. 
 
ఏకంగా 26 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ప్రస్తుతం 13 ఏళ్ల తర్వాత మమత చేపట్టిన దీక్షకు దేశంలోని రాజకీయ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మమతకు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవెగౌడ, ఎంకే స్టాలిన్, తేజస్వీయాదవ్, ఒమర్ అబ్దుల్లా తదితరులు ఇప్పటికే మమతకు మద్దతు తెలిపారు.
 
మరోవైపు పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దురదృష్టకరమని, ప్రధాని మోదీ ఓవరాక్షన్‌ వల్లే ఇటువంటి దుస్థితి నెలకొందని మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ విమర్శించారు. అధికారాలను దుర్వినియోగం చేస్తూ తీసుకుంటున్న ఇటువంటి చర్యలు భవిష్యత్తులో మోదీకి ఏ మాత్రం ఉపకరించవని మండిపడ్డారు.