గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (13:40 IST)

సీబీఐ కొత్త డైరెక్టరుగా రిషి కుమార్ శుక్లా... ఖర్గే అభ్యంతరాలు బేఖాతర్

దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టరుగా రిషి కుమార్ శుక్లా ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రధాని సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఆయన పేరును ఖారారు చేసింది. అయితే, ఈ కమిటీలోని ఓ సభ్యుడైన విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన అభ్యంతరాలను కమిటీ తోసిపుచ్చింది. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్, విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేలు ఉన్నారు. 
 
సీబీఐ డైరెక్టర్ పదవికి అర్హతలు ఉన్న 30 మంది పేర్లతో రూపొందించిన తుది జాబితాపై సమావేశంలో చర్చించారు. ఇందులో శుక్లా పేరును ప్రధాని మోడీ ఖరారు చేయగా, మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం తెలిపారు. అవినీతి నిరోధక నేర పరిశోధనలో తగినంత అనుభవం లేని కారణంగా శుక్లాను సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపిక చేయవద్దని కోరారు. అయితే, ఈ అభ్యంతరాలను తోసిపుచ్చిన కమిటీ.. సీబీఐ కొత్త డైరెక్టర్‌గా శుక్లాను నియమిస్తున్నట్లు కేంద్ర వ్యక్తిగత సిబ్బంది మంత్రిత్వశాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. 1983 మధ్యప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన శుక్లా గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. ప్రస్తుతం పోలీసు హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల సీబీఐలోని వివాదం పెను చర్చకు దారితీసిన విషయం తెల్సిందే. సీబీఐలో డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాల మధ్య అధికార పోరు తారా స్థాయికి చేరింది. దీంతో వర్మను కేంద్రం బలవంతంగా సెలవుపై పంపింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతనెల 10న కేంద్రం వర్మను పదవి నుంచి తొలిగించింది. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. అలోక్ వర్మను బదిలీ చేసిన తర్వాత తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావు వ్యవహరించారు.