శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (11:23 IST)

గాఢనిద్రలో ఉండగా.... పట్టాలు తప్పిన సీమాంఛల్ ఎక్స్‌ప్రెస్...

బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా హాజీపూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆనంద్ విహారి టెర్మినల్ - బీహార్‌లోని జోగ్బాని స్టేషన్ల మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది వరకు గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదంలో మొత్తం తొమ్మిది బోగీలు పల్టీ కొట్టాయి. ప్రమాదం విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలానికి వైద్య బృందాన్ని పంపించినట్లు రైల్వే ఉన్నతాధికారుల తెలిపారు. బాధితుల కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను ఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు.
 
కాగా, ఈ ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే, ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.