1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (09:16 IST)

జగన్ 'సాక్షి' పత్రిక వార్తలే పవన్ ప్రసంగ పాఠం : చంద్రబాబు సెటైర్లు

వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సొంత పార్టీ సాక్షిలో ప్రచురితమైన వార్తలనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారనీ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు

వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సొంత పార్టీ సాక్షిలో ప్రచురితమైన వార్తలనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారనీ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 
 
గుంటూరు వేదికగా జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై చంద్రబాబు బుధవారం రాత్రి స్పందించారు. జగన్ 'సాక్షి' పత్రికలో గతంలో వచ్చిన అంశాలనే ఆయన ప్రస్తావించారన్నారు. వాటిల్లో ఎటువంటి వాస్తవమూ లేదని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును తెచ్చి చదివినట్టుందని, పవన్ కల్యాణ్‌ను ముందు నిలబెట్టి ఎవరో కొత్త నాటకం ప్రారంభించారని చంద్రబాబు ఆరోపించారు. 
 
కాపులకు రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగకుండా చూస్తామని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తు చేసిన ఆయన, టీడీపీ సర్కారు కులాల మధ్య చిచ్చు పెడుతోందని పవన్ విమర్శించడాన్ని తప్పుబట్టారు. ఉద్దానం కిడ్నీ వంటి ఎన్నో సమస్యలను పవన్ ప్రభుత్వం దృష్టికి తెచ్చిన వేళ ఆయనపై గౌరవాన్ని చూపి సానుకూలంగా స్పందించామని, వాటన్నింటినీ మరచిపోయిన పవన్, ఇప్పుడు ఎందుకిలా విమర్శిస్తున్నాడో అర్థంకావడం లేదన్నారు. 
 
పవన్ చేసిన విమర్శలు ఒక్కో సినిమాకు ఒక్కో రచయిత మాటలు రాసినట్టే ఉందని అభిప్రాయపడ్డారు. విషయం లేని విమర్శలు గుప్పించడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రానికి రావాల్సిన సాయం రాబట్టడానికి తెలుగుదేశం పార్టీ తన సర్వశక్తులూ ఒడ్డి కేంద్రంపై పోరాడుతుంటే ఈ సమయంలో తమపై ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఏమిటని చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. 
 
మేం కేంద్రంపై పోరాటం చేస్తుంటే మాపై గురి పెట్టి మాట్లాడిస్తోంది ఎవరు? ఎవరి తరపున మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిని ఒక్క మాట అనడానికి నోరు రాకపోతే ఎలా? కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత ఆగ్రహం వ్యక్తమవుతుంటే వాళ్ల వైఖరి గురించి మాటైనా లేకుండా మాపై పడుతున్నారంటే అర్థమేంటి అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.