గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 మార్చి 2020 (14:44 IST)

#మహమ్మారి కరోనా అంటుకుందేమోనని కేంద్రమంత్రి ఇంట్లోనే స్వీయనిర్బంధం... ఎక్కడికెళ్లొచ్చారు?

కరోనా వైరస్ భారతదేశాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 7000 దాటింది. మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 126కి చేరుకోగా ఇందులో ముగ్గురు మృతి చెందారు. ఈ వైరస్ ఎటు నుంచి ఎటువైపు వస్తుందో తెలియని స్థితి నెలకొంది. 
 
ఐతే ఎవరికివారు వ్యక్తిగత శుభ్రతను, జాగ్రత్తలను పాటిస్తే వైరస్ ను అడ్డుకునే పరిస్థితి వుంది. అలాగే కరోనా వైరస్ వ్యాధి లక్షణాలతో ఎవరైనా కనబడితే వారి గురించి సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా అటువంటి వారికి దూరంగా వుండటం చేయాలి. 
 
ఇక అసలు విషయానికి వస్తే... కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్... అంటూ స్వీయ గృహనిర్బంధాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఆ సమావేశాలకు తను వెళ్లబోవడం లేదని తెలిపారు. సమావేశాలకు హాజరు కాకూడదని, ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిశ్చయించుకున్నారు.
 
కరోనా వైరస్ లక్షణాలు ఆయనలో కనిపించకపోయినప్పటికీ ఆయన ఇంటికే పరిమితం కావడం వెనుక కారణం వుంది. అదేంటంటే... మార్చి 14న తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(SCTIMST)లోని డైరక్టర్స్ ఆఫీస్‌లో జరిగిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈయన కేరళకు చెందినవారు కావడంతో ఆయన వెళ్లారు. ఇదే సమావేశానికి స్పెయిన్ నుంచి వచ్చిన ఓ వైద్యుడు కూడా పాల్గొన్నాడు. ఇతడు మార్చి 1 నుంచి ఈ హాస్పిటల్లో పనిచేశాడు. 
 
ఐతే ఈ వైద్యుడికి కరోనా పాజిటివ్ అని ఆదివారం నిర్థారణ కావడం ఆయన మార్చి5 వరకు ఆ హాస్పిటల్లో పనిచేయడంతో ఇతరులకు కూడా సోకి వుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో హాస్పిటల్‌ను షట్ డౌన్ చేయడమే కాకుండా ఆ రోజు సమావేశానికి వచ్చిన 25 మంది వైద్యులతో సహా 75 మంది ఉద్యోగులను లిస్టవుట్ చేసి వాళ్లందరినీ ఐసోలెట్ చేశారు. వీరిలో మంత్రిగారు కూడా వుండటంతో వెంటనే ఆయనకు సమాచారం అందించారు. దీనితో కేంద్రమంత్రి ఢిల్లీలోని తన నివాసంలోనే స్వీయ నిర్బంధాన్ని విధించుకుని విధులను అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ విషయంలో కేరళ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పలువురు అభినందిస్తున్నారు.