గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (17:50 IST)

వైకాపాలోకి ఆంధ్రా చిన్నమ్మ? పర్చూరు నుంచి దగ్గుబాటి?

ఆంధ్రా చిన్నమ్మగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఒంగోలు జిల్లాలోని పర్చూరులో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైకాపా శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానెర్లలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఫోటోలు ప్రముఖంగా ఉన్నాయి. దీంతో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఈయన పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న పురంధేశ్వరి రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. ఇపుడు ఆమె బీజేపీకి షాకిచ్చిన వైకాపాలో చేరాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా, విభజన హామీలను నెరవేర్చడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటతప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం కంటే ప్రధానిగా నరేంద్ర మోడీనే మోసం చేశారనే భావన రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉంది. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి చావుదెబ్బతింది. 
 
117 సీట్లలో పోటీ చేసి కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ కారణంగానే తమ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా వారు వైకాపాలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై సంక్రాంతి పండుగ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని దగ్గుబాటి వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.