శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (12:23 IST)

ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్

దేశంలో అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇందుకోసం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ రిజర్వేషన్ల కోసం ఇటీవల రాజ్యాంగానికి చేసిన సవరణను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆమోదించిన విషయం తెలిసిందే. 
 
ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకార దేశంలోని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడి జనరల్ క్యాటగిరీలో ఉన్న పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా 10 శాతం రిజర్వేషన్ల కల్పన సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
రాజ్యాంగ (103వ సవరణ) చట్టం-2019 లోని సెక్షన్-1లో గల ఉప సెక్షన్ (2) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం జనవరి 14వ తేదీ నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 
 
సోమవారం నుంచి ఈ రిజర్వేషన్లు అమలవుతాయి అని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వశాఖ తన గెజిట్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. కొత్త నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది.