1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (09:07 IST)

అయోధ్య విషయంలో హిందువుల్లో ఓపిక నశిస్తోంది : గిరిరాజ్

అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయంలో హిందువుల్లో ఓపిక నశిస్తోందని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. శ్రీరామ్‌ అనే పదం హిందువుల విశ్వాసానికి పునాదిరాయి వంటిదన్నారు. అయోధ్య వివాదంపై విచారణకు సంబంధించి సరైన ధర్మాసనం వచ్చే జనవరిలో నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో గిరిరాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
మరోవైపు, అయోధ్య కేసులో బీజేపీకి సుప్రీంకోర్టులో ఆశాభంగం ఎదురైంది. ఈ కేసులో విచారణను ప్రస్తుతం చేపట్టేదే లేదని తేల్చిచెప్పేసింది. 'ఈ కేసులో రోజువారీ విచారణ ఎప్పట్నుంచి మొదలెట్టాలో జనవరి మొదటివారంలో నిర్ణయిస్తాం.. 'తగిన' ధర్మాసనం ఈ తేదీలను ఖరారు చేస్తుంది' అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. 'ఇది వందేళ్ల నాటి కేసు. దీన్ని తొలి ప్రాధామ్యాంశంగా చేపట్టాలి' అని యూపీ ప్రభుత్వం చేసిన వినతిని ఆయన తోసిపుచ్చారు. 'మాకు వేరే ప్రాథమ్యాలున్నాయంటూ' ఆయన ఈ కేసు అంశాన్ని కేవలం 4 నిమిషాల్లో ముగించేశారు. 
 
సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయంపై బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్య కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్న కోర్టు వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంస్థలు అసహనం వ్యక్తం చేశాయి. హిందువుల ఓపిక నశిస్తోందని, ఇంకా ఎన్నాళ్లు నిరీక్షించాలని ప్రశ్నించాయి. రామ మందిరం నిర్మాణం కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశాయి. 
 
బీజేపీ నేత వినయ్‌ కతియార్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఒత్తిడి వల్లే తీర్పు జాప్యమవుతోందని, కపిల్‌ సిబల్‌, ప్రశాంత్‌ భూషణ్‌ వంటివారు జాప్యం చేసేలా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రామమందిరం అంశంలో కోర్టు ఏమీ చేయలేదని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ అన్నారు. బాబ్రీ మసీదును కూల్చినప్పుడు కోర్టును అడిగి కూల్చామా? అని ప్రశ్నించారు.