శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జులై 2018 (12:30 IST)

లైవ్ ఫైట్ : మహిళా న్యాయవాది చెంపలు వాయించిన ముస్లిం మతపెద్ద

ఇటీవలి కాలంలో పలు టీవీలు నిర్వహించే చర్చా కార్యక్రమాలు ఘర్షణలకు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ చానెల్ ట్రిపుల్ తలాక్‌పై ఓ చర్చను నిర్వహించింది. ఇందులో ముస్లిం మతపెద్దతో పాటు.. ఓ మ

ఇటీవలి కాలంలో పలు టీవీలు నిర్వహించే చర్చా కార్యక్రమాలు ఘర్షణలకు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ చానెల్ ట్రిపుల్ తలాక్‌పై ఓ చర్చను నిర్వహించింది. ఇందులో ముస్లిం మతపెద్దతో పాటు.. ఓ మహిళా న్యాయవాది కూడా పాల్గొన్నారు.
 
'జీ హిందూస్తాన్' న్యూస్ చానల్ ట్రిపుల్ తలాక్‌పై చర్చా కార్యక్రమం నిర్వహించింది. మౌలానా ఎజాజ్ అర్షద్ ఖాస్మి, సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరా ఫయాజ్ తదితరులు చర్చకు హాజరయ్యారు. చర్చ జరుగుతుండగా ఎజాజ్, ఫరా మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ముదిరింది. షో లైవ్ టెలికాస్ట్ అన్న విషయాన్ని మర్చిపోయిన ఎజాజ్ నిలబడి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఫరా కూడా లేచి వాదించడం మొదలుపెట్టారు.
 
ఇంతలో ఉన్నట్టుండి నిగ్రహం కోల్పోయిన ఖాస్మి.. ఫయాజ్‌పై దాడి చేశారు. ఆమె చెంపలు వాయించారు. దీంతో, ఈ షో చూస్తున్న ప్రేక్షకులతోపాటు షోలో పాల్గొన్న మిగతావారు, టీవీ యాంకర్ అవాక్కయ్యారు. వెంటనే వారిని విడిపించే ప్రయత్నం చేసినా ఆయన ఆగలేదు సరికదా.. వారిని తోసుకుంటూ మరిన్నిసార్లు ఆమెపై దాడిచేశాడు. ఇకచేసేదేం లేక టీవీ చానల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎజాజ్‌ను అరెస్ట్ చేశారు.