శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (17:23 IST)

పకోడీలు అమ్ముకుని.. రోజుకు రూ.30వేలు సంపాదిస్తున్నా...

యువతకు ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ కొత్తగా పకోడీల ఫిలాసఫీని ప్రజల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కోటి ఉద్యోగాల మాట గుర్తు చేసినప్పుడల్లా మోదీ చేసే వ్య

యువతకు ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ కొత్తగా పకోడీల ఫిలాసఫీని ప్రజల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కోటి ఉద్యోగాల మాట గుర్తు చేసినప్పుడల్లా మోదీ చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి.


జనవరి 26వ తేదీన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పకోడీలు అమ్ముకుంటూ బతుకుతున్న వ్యక్తిని కూడా ప్రభుత్వం నిరుద్యోగుల జాబితాలో చేరుస్తుందని, వాస్తవానికి స్వయం ఉపాధిని నమ్ముకుని బతుకుతున్నవారు భారత్‌లో హాయిగా జీవిస్తున్నారని, వారిని నిరుద్యోగ సమస్య పీడించడం లేదని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. 
 
ఉద్యోగం రాని యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా పకోడీలు అమ్ముకుని అయినా బతకవచ్చుననే మోదీ మాటలను ఓ యువకుడు ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. మోదీ వ్యాఖ్యలపై విపక్షాల రాద్ధాంతాన్ని పక్కనబెడితే.. ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్న ఓ గుజరాత్ యువకుడు పకోడీల వ్యాపారం మొదలెట్టాడు. ఈ పకోడీల వ్యాపారంతో నెలకు రూ. 9లక్షలు సంపాదించే స్థాయికి చేరాడు. తనతో పాటు మరో పదిమందికి ఉపాధి కల్పించాడు.
 
వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన నారాయణ అనే యువకుడు హిందీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఏ ఉద్యోగమూ లేని వేళ, ప్రధాని సలహాతో పకోడీల దుకాణాన్ని ప్రారంభించాడు. రోజుకు 10 కిలోల పకోడీలను తయారుచేసి విక్రయించేవాడు. మెల్లగా రుచి నచ్చడంతో కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఫలితంగా తన షాపులను ఒకటి తర్వాత ఒకటి పెంచుకుంటూ పోయాడు. 
 
ప్రస్తుతం వడోదరలో నారాయణ్ పకోడీ స్టాల్స్ 35 వరకూ ఉన్నాయి. రోజుకు 500 కిలోల పకోడీలు ఇక్కడ తయారవుతుండగా, రోజుకు రూ. 30 వేలకు పైగా ఆదాయం లభిస్తోంది. తాను పకోడీ స్టాల్ ప్రారంభించేందుకు కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనేనని నారాయణ్ చెప్తున్నాడు.