1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:31 IST)

దేశ ద్రోహం కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష - దుబాయ్‌లో ఆర్మీ మాజీ చీఫ్

దేశద్రోహం కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మాజీ సైనికాధిపతి పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు పెషావర్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. 2013లో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు కాదా, ఈ కేసును విచారించేందుకు గత 2014లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టులో విచారణ పూర్తిస్థాయి విచారణ జరిగింది. ఇందులో సాక్ష్యాలను పరిశీలించిన పిమ్మట ముషారఫ్ దేశద్రోహానికి పాల్పడినట్టు తేలింది. దీంతో ఆయనకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
నిజానికి ముషారఫ్ గత 2016లో పాకిస్థాన్‌ను వదిలి లండన్‌కు వెళ్లిపోయారు. అక్కడ కొంతకాలం నివసించిన తర్వాత ప్రస్తుతం దుబాయ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. పైగా, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కేసులో కోర్టుకు హాజరుకావాలంటూ పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. దీంతో ముషారఫ్‌ను పరారీలో ఉన్న వ్యక్తిగా పాకిస్థాన్ సర్కారు ప్రకటించింది. అంతేకాదు, తక్షణమే ఆయనను అరెస్టు చేసేందుకు ఆదేశాలు కూడా జారీచేసింది.
 
ఈ నేపథ్యంలో దేశద్రోహం కేసును విచారించిన ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం తుదితీర్పును వెలువరించింది. ఈ ధర్మాసనానికి పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వం వహించారు. దీంతో, ఈ ప్రత్యేక కోర్టుకు హైకోర్టు స్థాయి ఉంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో ముషారఫ్ అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది.
 
మరోవైపు ఇటీవలే ముషారఫ్ స్పందిస్తూ తనపై ఉన్న అభియోగాలన్నీ నిరాధారమైనవన్నారు. తన లాయర్ వాదనను కూడా కోర్టు వినడం లేదని విమర్శించారు. పాకిస్థాన్ కోసం తాను యుద్ధాలు చేశానని... దేశాధ్యక్షుడిగా దేశానికి సేవలందించానని గుర్తుచేశారు.