బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (10:53 IST)

అమరావతిలో చంద్రబాబు ఇంటికి రానున్న రాహుల్ - మాయావతి

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. 
 
ఢిల్లీ వెళ్లి పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. ఇటీవల కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వారికి వివరించారు. చంద్రబాబు ప్రయత్నాలకు అనూహ్య స్పందన వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వచ్చి... ధర్మపోరాట దీక్షలో పాల్గొని, చంద్రబాబు ఇంట్లో విందు ఆరగిస్తారన్న ప్రచారం జోరుగాసాగుతోంది. ఇందుకోసం రాహుల్ డిసెంబర్ 23వ తేదీన అమరావతికి రానున్నట్టు సమాచారం. 
 
రాహుల్‌తోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల ముఖ్యనేతలు విందులో పాల్గొననున్నారని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో పాటు మరో 10 మంది జాతీయ నాయకులు తరలిరానున్నారనే వార్తలు వస్తున్నాయి. అదేరోజు అమరావతిలో ప్రత్యేక హోదా కోసం జరిగే చివరి ధర్మపోరాట దీక్షలో రాహుల్ గాంధీతో పాటు నాయకులందరూ పాల్గొంటారని సమాచారం.