శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (18:05 IST)

ప్రధాని నరేంద్ర మోడీకి లొంగిపోయిన కేసీఆర్.. శశిథరూర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆరోపించారు. ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ,

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆరోపించారు. ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ముందస్తు ఎన్నికల్లో తెరాస కారు గుర్తుకు ఓటేస్తే అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టేనని ఆయన జోస్యం చెప్పారు.
 
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తే ఆ నోట్ల రద్దుకు మద్దతు పలికిన తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రధాని మోడీ అచ్చేదిన్ తేలేదు కానీ... మంచి మాటలు మాత్రం చెబుతున్నారని సెటైర్లు వేశారు. ముఖ్యంగా, జై జవాన్ అంటూ రాఫెల్‌ కుంభకోణం... జైకిసాన్ అంటూ రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగాలను ప్రధాని మోడీ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్లరద్దు అనాలోచిత నిర్ణయమని, ఈ నిర్ణయం కారణంగా ఏటీఎంల దగ్గర నిలబడి 180 మంది మృతిచెందారన్నారు. నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమల్లో ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.