1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (10:19 IST)

నేడు చెన్నైకు రానున్న కేసీఆర్... ఫెడరల్ ఫ్రంట్ కోసం యత్నాలు..

దేశంలో సరికొత్త రాజకీయ మార్పిడి కోసం తనవంతు ప్రయత్నాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఆదివారం చెన్నైకు రానున్నారు. ఆదివారం ఉదయం 11:30 నిమిషాలకు బేగంపేట్ ఏయిర్ పోర్ట్ నుంచి

దేశంలో సరికొత్త రాజకీయ మార్పిడి కోసం తనవంతు ప్రయత్నాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఆదివారం చెన్నైకు రానున్నారు. ఆదివారం ఉదయం 11:30 నిమిషాలకు బేగంపేట్ ఏయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు ఆదివారం మధ్నాహం 1:30 గంటలకు మాజీ సీఎం కరుణానిధితో, మధ్యాహ్నం 3 గంటలకు స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. అలాగే రాత్రికి చెన్నైలోనే బసచేసి, సోమవారం ఏప్రిల్ 30వ తేదీన మరికొందరు ప్రముఖులతో భేటీ కానున్న సీఎం.. అదేరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం కానున్నారు.
 
కాగా, గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశహితంకోసం కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో, నాయకులతో చర్చలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లి, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో సమావేశంకానున్నారు. 
 
ఈ పర్యటనలో కరుణానిధి ఆరోగ్యంపై వాకబు చేయడంతోపాటు ఫ్రంట్ గురించి ఆయనతో చర్చిస్తారు. అనంతరం తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమావేశమై, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చలు జరుపుతారు. గత బుధవారం పలువురు డీఎంకే నాయకుల ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు వచ్చి ఫెడరల్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. వారి ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్, పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, ఎంపీ కవితలతో కూడిన బృందం చెన్నైకి బయల్దేరి వెళ్తున్నట్టు సమాచారు.