శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (18:06 IST)

మోదీ ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేకుంటే బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చి ఆపై స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నామని మాట మార్చారు. దీనిపై ఏపీ ప్రజలు బీజేపీ సర్కారుపై గుర్రుగా వున్నారు. మోదీ సర్కారుపై అధికార పక్షం టీడీపీ నిరసన తెలుపుతూ శుక్రవారం నల్లదుస్తులు ధరించింది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా ధరించి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసన వ్యక్తం చేశారు. 
 
తాజాగా ప్రధాన మంత్రిపై సినీ హీరో, మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముఖ్యమైన అంశంపై స్పందించే మంచు మనోజ్.. తాజాగా ఏపీ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేదని ఫైర్ అయ్యాడు. 
 
పీఎం నరేంద్ర మోదీ.. ఇన్నాళ్లు మీరు చేస్తున్న పోరాటానికి తాము మద్దతిచ్చాం. మాకు మీరేదో చేస్తారనుకున్నాం. మీరిచ్చిన హామీలను నెరవేరుస్తారని.. ఇంతకాలం మిమ్మల్నే సపోర్ట్ చేస్తూ వేచి చూశాం. కానీ స్పెషల్ స్టేటస్ కాదు కదా.. కనీసం కృతజ్ఞతాభావం కూడా మీ నుంచి రాలేదు. ఇప్పటికైనా మా డిమాండ్‌ను గౌరవించి, మా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేదంటే మీరు ఎవరి సన్నిధిలో అయితే ఆ ప్రమాణం చేశారో.. ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించాడు. 
 
ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని ఏపీకి చెందిన పలువురు షేర్ చేస్తూ మంచు మనోజ్ రియల్ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై మోదీ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను జత చేస్తున్నారు.