శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2019 (13:08 IST)

మేము 150 సీట్లు గెలుచుకోబోతున్నాం... 'రంగస్థలం'లో నారా లోకేష్

అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 150 స్థానాలను తెదేపా గెలుచుకోబోతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. బిబిసి తెలుగు విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం రంగస్థలంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిబిసి తెలుగు విజయవాడలో శనివారం నాడు రంగస్థలం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
 
భాజపా ఇచ్చిన 18 హామీలను నెరవేర్చకపోవడం వల్లనే తాము ఎన్డీఎ నుంచి వైదొలగినట్లు వెల్లడించారు నారా లోకేష్. తెలంగాణ సీఎం పదేపదే తెదేపాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అంటున్నారనీ, అసలు అదేమిటో చెప్పాలన్నారు. హైదరాబాదులో వున్న తెదేపా కార్యకర్తలను తెరాస బెదిరిస్తోందని విమర్శించారు.
 
ఏపీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ప్రకారం ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న రాష్ట్రమనీ, ఈ విషయంలో దేశంలోనే ఏపీ తృతీయ స్థానంలో వున్నట్లు చెప్పారు. అంతేకాదు... ప్రజా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం సఫలమైందనీ, బడ్జెట్టులో కేటాయింపులు చేసినట్లు చెప్పారు. వెనుకబడ్డవారి కోసం రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.
 
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ...  2018లో తెలంగాణ ఎన్నికలకు ముందు ప్రి-పోల్ సర్వే ఫలితాలు తేడా వచ్చాయనీ, అందుకే ఈసారి ఎన్నికలు ముగిశాక సర్వే ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందేందుకు అవసరమైన నిధులను రాబట్టేందుకు లోక్ సభ నుంచి మరింత బలమైన ప్రాతినిధ్యం అవసరమని అభిప్రాయపడ్డారు. బయోపిక్ సినిమాలను కానీ మీడియాలో వచ్చే కథనాలు చూసి కానీ భారతదేశ ప్రజలు ప్రభావితం కాబోరనీ, వారంతా విజ్ఞతతో ఓటు వేస్తారని అన్నారు.
 
సిఐఐ మహిళా నెట్వర్క్ మాజీ చైర్మన్ నాగలక్ష్మి మాట్లాడుతూ... విధాన రూపకల్పనలు స్థితిలో మహిళలు ఎదగాల్సిన అవసరం వుందని అన్నారు. అఖిలభారత డెమొక్రటిక్ మహిళా సంఘం ప్రతినిధి డి రమాదేవి మాట్లాడుతూ... లింగ వివక్ష అనేది రూపుమాపాల్సి వుందన్నారు. ఎలరైతే మహిళలపై సెక్సీయెస్ట్ అంటూ వ్యాఖ్యలు చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెదేపా యామిని సాధినేని, వైకాపా నుంచి పుణ్యసుశీల, మార్గం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు లక్ష్మి అందరూ దీన్ని సమర్థించారు.