శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (12:33 IST)

పి.నారాయణనను వెన్నుపోటు పొడిచిన టీడీపీ నేతలు

టీడీపీ సర్కారులో అన్నీతానై ఉన్న మంత్రి నారాయణ ఓడిపోయారు. ఆయన కేవలం 1988 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. మంత్రిగా ప్రతి నిమిషం ఎంతో బిజీగా ఉన్న నారాయణ నెల్లూరు పట్టణ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ... నగర ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండలేక పోయారు. ఫలితంగా ఆయన వైకాపా యువ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. పి. నారాయణ ఓటమికి గల కారణాలను టీడీపీ శ్రేణులు ఇపుడు విశ్లేషిస్తున్నాయి. 
 
నిజానికి గత ఎన్నికల్లో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో వైకాపా అధికారానికి దూరమైంది. ఈ ఎన్నికల్లో నెల్లూరు పట్టణం నుంచి వైకాపా ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. అధికారంలో లేకపోయినా ఆయన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నారు. 
 
మరోవైపు కొంత మంది స్థానిక నాయకులు నారాయణ చుట్టూ కోటరీగా చేరి ఆయన్ను ప్రజలకు దగ్గరయ్యే అవకాశం లేకుండా చేశారు. మంత్రి మంచి వాడే అయినా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కాదనే భావన సామాన్య ప్రజల్లో కలిగింది. ఇది కొంత ప్రతికూల ఫలితాలు చూపగా, మరోవైపు పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచిన సొంత పార్టీ నాయకుల వల్ల నారాయణకు పెద్ద నష్టం జరిగిందని ప్రచారం. 
 
గత 20 ఏళ్లుగా నగర టీడీపీ వెన్నుపోట్లకు నిలయంగా పేరుపొందింది. నారాయణ అభ్యర్థి అయితే అన్ని వర్గాలు కలిసి పనిచేస్తాయని టీడీపీ అధిష్టానం భావించింది. అయితే చివర్లో నారాయణకు సైతం వెన్నుపోట్ల బెడద తప్పలేదు. ఆయన ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందిన కొంత మంది నాయకులే ఎన్నికల్లో ఆయనకు వెన్నుపోటు పొడిచారు. 
 
పోలింగ్‌ రోజే ఆ విషయం స్పష్టంగా బయటపడింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగుకు ఒకరు చొప్పున ఉంటే మెజారిటీ పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు కాని, కార్యకర్తలు కాని కనిపించకపోవడమే దీనికి నిదర్శనం. ఒకవైపు ఫ్యాను గాలి, మరోవైపు వెన్నుపోట్ల కారణంగా భారీ మెజారిటీతో గెలుస్తాడని అంచనా వేసుకున్న నారాయణ స్వల్ప మెజారిటీతో ఓటమి చెందాల్సి వచ్చింది.