శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2015 (17:01 IST)

క్షుద్రపూజల కోసం ఇంట్లోనే నాలుగేళ్ళ బాలుడి తల తెగనరికిన కసాయి.. ఎక్కడ?

టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మూఢ విశ్వాసాలు ప్రజలను వీడిపోవడం లేదు. ఫలితంగా అభంశుభం తెలియని చిన్నారులను నరబలి పేరుతో దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో క్షుద్రపూజల కోసం నాలుగేళ్ళ బాలుడి తల తెగనరికి నరబలి ఇచ్చిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలను పరిశీలిస్తే.. 
 
ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన తిరుమల రావు అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ అంగన్‌వాడీ పాఠశాలలో చదువుకునే మనోజ్ సాయి అనే నాలుగేళ్ళ బాలుడికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. తన ఇంట్లోనే దేవుళ్ల ఫోటోల ముందు కొద్దిసేపు కూర్చోబెట్టి.. పూజలు చేసి ఆ తర్వాత మనోజ్ సాయి తల నరికేశాడు. తమ పిల్లోడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. 
 
అయితే, తిరుమలరావు బాలుడిని తీసుకెళ్తుండగా ఇరుగుపొరుగువారు గుర్తించారు. ఈ విషయం ఆ బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తిరుమలరావు ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే బాలుడు తల, మొండెం వేరు చేసి పూజలు చేస్తున్నాడు. బాలుడి మృతదేహాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు తిరుమలరావును పట్టుకుని చితకబాదారు. ఆతర్వాత శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 
 
ఈ నరబలి సమాచారం తెలుసుకున్న పోలీసులు హూటాహుటిన గ్రామానికి చేరుకుని మంటల్లో కాలిపోతున్న తిరుమలరావును రక్షించారు. తీవ్రగాయాలపాలైన తిరుమలరావును కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తే కలిసొస్తుందని ఎవరో చెప్పడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం.