శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (12:42 IST)

మహాకేటుగాడు.. డాక్టర్లకే ఎసరు పెట్టాడు..! పక్కా మోసం చేశాడు.

చదువు అబ్బలేదు.. కానీ ఎదుటి వారిని బోల్తా కొట్టించదగిన మాటలు అతని సొంతం. ఎవరి దగ్గర డబ్బులుంటాయి. మోసపోయినా పట్టించుకునే సమయం ఎవరికి ఉండదో చూసుకున్నాడు. ఇవన్నీ గమనించుకున్న అతగాడు తాను మోసం చేయడానికి డాక్టర్లను ఎంపిక చేసుకున్నాడు. కన్సల్టింగ్ ఏజెన్సీ పేరుతో వసూలు చేసి వారికి కుచ్చుటోపీ పెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. 
 
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన 39 ఏళ్ల నంబూరి రవి ఏడో తరగతిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆన్‌లైన్‌లో తేజస్విని కన్సల్టింగ్ పేరిట ఒక వెబ్‌సైట్‌‌ను సృష్టించి, తనకు విదేశాల్లో క్లయింట్లు ఉన్నారని, అక్కడ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో డాక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వైద్యులకు ఎర వేశాడు. 
 
రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.9 వేలు తన బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని షరతు పెట్టాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది డాక్టర్లు అతడిని నమ్మి మోసపోయారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన బట్టు శ్రీనివాసరావు, కాకినాడకు రంగరాయ మెడికల్ కళాశాలలో చదువుకున్న దాదాపు పది మంది వైద్యులు కూడా తాము రవి చేతిలో మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం పెద్దాపురం ఏడీబీ రోడ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న రవిని పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.9 లక్షలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.