చిత్తూరు జిల్లాకు చేరుకున్న యాంకర్ నిరోషా పార్థీవ దేహం
హైదరాబాద్లో నిన్న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యాంకర్ నిరోషా పార్థీవ దేహం చిత్తూరు జిల్లాకు చేరుకుంది. నిరోషా స్వగ్రామం చిత్తూరుజిల్లాలోని సోమల మండలం మల్లేశ్వరపురం. నిరోషా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు రాధాక్రిష్ణమనాయుడు, వసంతమ్మలు హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళారు. నిరోషా పార్థీవ దేహాన్ని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తీసుకువచ్చారు. నిరోషా బంధువర్గం మల్లేశ్వరపురంలో ఉండడంతో ఈ ప్రాంతంలోనే అంత్యక్రియలు జరపాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
నిరోషా పార్థీవ దేహాన్ని చూపిన బంధువులు, మల్లేశ్వరపురం గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఎప్పుడు ఆడుతూ, పాడుతూ చలాకీగా ఉండే నిరోషా చనిపోయిందన్న విషయాన్ని గ్రామస్తులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. నిరోషా మల్లేశ్వరపురంలోని నంజంపేట ఉన్నతపాఠశాలలో పదోతరగతి వరకు చదువుకుంది. అలాగే తిరుపతి పద్మావతి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తండ్రి రాధాక్రిష్ణమనాయుడు వ్యాపారం నిమిత్తం బెంగుళూరుకు వెళ్ళడంతో కుటుంబం మొత్తం ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ తరువాత హైదరాబాద్లో రెండు సంవత్సరాల పాటు జెమినీ టీవీలో యాంకర్గా నిరోషా పనిచేశారు. సాయంత్రం నిరోషా అంత్యక్రియలు జరుగనున్నాయి.