శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (13:03 IST)

వైకాపా ప్రభుత్వంతో అభద్రత : వైకాపా ఎంపీకి కేంద్ర బలగాల రక్షణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వ హయాంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ పార్టీకే చెందిన అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అభద్రతాభావం నెలకొంది. దీంతో ఆయన కేంద్ర బలగాల రక్షణ కోరారు. ఫలితంగా ఆయనకు కేంద్రం వై కేటగిరీ కింద భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
గత కొంతకాలంగా ఆయన వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను తూర్పారబడుతున్నారు. ఫలితంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు విమర్శలు గుప్పించడమేకాకుండా కేసులు కూడా పెడుతున్నారు. 
 
దీంతో వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందని... కేంద్ర బలగాలతో తనకు భద్రతను కల్పించాలంటూ కేంద్ర హోం శాఖతోపాటు.. లోక్‌సభ  స్పీకరుకు విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపాన్ని పరిశీలించిన కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆయనకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది. 
 
దీనిపై రఘురాజు మాట్లాడుతూ, తనకు వై-కేటగిరీ భద్రతను కల్పించినట్టు బుధవారం రాత్రి తెలిసిందని చెప్పారు. ఈరోజు అధికారికంగా లేఖ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వై-కేటగిరీ కింద తనకు దాదాపు 10 మంది సెక్యూరిటీగా ఉండొచ్చని చెప్పారు. 
 
ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ ఉందని... కర్ఫ్యూని సడలించిన తర్వాత వస్తానని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టరుతో మాట్లాడతానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపై తాను ఇచ్చిన ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం భద్రతను కల్పించిందని చెప్పారు. తన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.