శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (10:56 IST)

నారా బ్రహ్మణి స్కూల్‌మేట్ అఖిల ప్రియ.. కొత్త మంత్రుల రాజకీయ నేపథ్యం ఇదే

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐదుగురు పాత మంత్రులకు ఉద్వాసన పలికి... కొత్తవారికి చోటు కల్పించారు. వీరిలో వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐదుగురు పాత మంత్రులకు ఉద్వాసన పలికి... కొత్తవారికి చోటు కల్పించారు. వీరిలో వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా రెడ్డితో పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా ఉన్నారు. 
 
కాగా, మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లా రేగడి గ్రామంలో జన్మించిన కళా వెంకట్రావు బీఏ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఎచ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 
 
ఆ తర్వాత ఏపీ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. విదేశాల్లో విద్యను అభ్యసించిన ఈయన... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసన సభ్యుల కోటాలో శాసనమండలికి తొలిసారి ఎన్నికయ్యారు. 
 
మంత్రి పదవిని దక్కించుకున్న వారిలో పితాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన పితాని, గతంలోనూ మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆచంట ఎమ్మెల్యేగా ఉన్నారు. 
 
గుంటూరు జిల్లా సిరిపురంలో జన్మించి, ప్రస్తుతం వేమూరు ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న నక్కా ఆనంద్ బాబు ప్రమాణం చేశారు. బీఏ బీఎల్ విద్యను అభ్యసించిన ఆనంద్ బాబు, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
 
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎమ్మెల్సీగా పనిచేసిన చరిత్ర, నెల్లూరు జిల్లా టీడీపీలో గట్టి పట్టున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు జిల్లా అల్లిపురం గ్రామంలో ఆయన జన్మించారు.
 
 బొబ్బిలి రాజ వంశీకుడైన రంగారావు విజయనగరం జిల్లా నేత. ఈయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీఏ విద్యను అభ్యసించి, ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
 
అనంతపురం జిల్లా కేకే అగ్రహారం గ్రామంలో జన్మించిన కాల్వ శ్రీనివాసులు, ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యేగా సేవలందిస్తూ, నేటి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. కాల్వ నిన్నటివరకూ ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. గతంలో ఓ మారు ఎంపీగానూ సేవందించారు.
 
కడప జిల్లా దేవగుడి గ్రామంలో జన్మించిన చదిపిరాల ఆదినారాయణరెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెస్సీ చదివిన ఆదినారాయణ రెడ్డి, ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, అంతకుముందు లెక్చరరుగా కూడా పనిచేశారు.
 
తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ మంత్రిగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా గానుగపాడులో జన్మించిన జవహర్, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకపూర్వం టీచర్ గానూ పనిచేశారు.
 
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ అమర్ నాథ్ రెడ్డి ప్రమాణం చేశారు. చిత్తూరు జిల్లా కెళావతిలో పుట్టిన ఆయన, ప్రస్తుతం పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, గతంలో ఒకసారి చిత్తూరు ఎంపీగానూ పనిచేశారు.
 
ప్రస్తుత క్యాబినెట్‌లో అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డును సృష్టిస్తూ, 28 ఏళ్ల వయసులోనే భూమా అఖిలప్రియ మంత్రిగా ప్రమాణం చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న అఖిలప్రియ, తల్లి శోభ మృతితో ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెల్సిందే.