బిల్గేట్స్తో చంద్రబాబు.. : ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ అభివృద్ధికి సహకరించండి!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దావోస్లో సమావేశమయ్యారు. అలాగే, సీఈఓ సత్య నాదెళ్ళతో కూడా ఆయన భేటీ అయ్యారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు నాలుగో రోజైన శుక్రవారం వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశమైంది. సదస్సులో చంద్రబాబును చూసి బిల్గేట్స్ ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చేసిన కృషిని, అందుకు బిల్గేట్స్ తోడ్పాటును చంద్రబాబు గుర్తు చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను బిల్గేట్స్కు చంద్రబాబు వివరించారు. కొత్త రాష్ట్రంలో సాప్ట్వేర్, ఐటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం రూపొందించిన ఎలక్ట్రానిక్ పాలసీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐటీలో రూ.12 వేల కోట్లు, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో రూ.30 వేల కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి నుంచి అనంతపురం వరకూ రెండు ఐటీఐఆర్లు, రాష్ట్రవ్యాప్తంగా పది ఐటీ హబ్లు, 20 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిపారు. అందువల్ల డిజిటల్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.