శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (13:39 IST)

మోడీ నోటి వెంట ఏపీ ప్రత్యేక హోదా మాట: బాబుతో భేటీ.. ఏం చెప్పారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్న చంద్రబాబు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కూడా సమావేశమయ్యారు. తద్వారా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఒకింత మంచి ఫలితాలనే ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇంతకుముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన సందర్భాలున్నాయి. కానీ ప్రధాన మంత్రి ప్రత్యేకహోదాపై మాటెత్తినట్లు దాఖలాలు లేవు. అయితే తాజాగా మంగళవారం బాబుతో సమావేశమైన మోడీ నోటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదాపై మాటొచ్చింది.
 
‘‘ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటాం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ తుచ తప్పకుండా అమలు చేస్తాం'' అని నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి కూడా నీతి ఆయోగ్ నుంచి నివేదిక అందింది. దాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఏపీ ప్రజలకు తీపికబురు వస్తుందని చంద్రబాబుతో మోడీ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.