శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (13:10 IST)

ప్రత్యేక హోదా రాదని కేంద్రం చెప్పింది.. ఏపీ ప్రజలు విభజన కోరుకోలేదు : చంద్రబాబు

ఏపీకే కాదు దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం లోక్‌సభలో చెప్పిందని అందువల్ల ప్రత్యేక నిధుల కోసం పోరాడుదామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే, ఏపీ మంత్రులు మాత్రం ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటన ఏపీకి వర్తించదని మీడియా ముందుకు వచ్చి చెప్పడం కాస్త విడ్డూరంగా ఉంది. 
 
శనివారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేక హోదాపై స్పందించారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగానే కేంద్రం లోక్‌సభలో ప్రకటన చేసిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీది ప్రత్యేక పరిస్థితన్నారు. గత పాలకులు అసమగ్ర విభజన చేసి రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రాష్ట్రాలతో సమానంగా పోటీపడే స్థాయి వచ్చే వరకూ కేంద్రం సహకరించాలని కోరారు.
 
ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉందామని సమావేశంలో పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అసలు ఏపీ ప్రజలు విభజనను కోరుకోలేదన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేంత వరకు కేంద్రం సాయం చేయాల్సిందేనని అన్నారు. 
 
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, జగన్ మోహన్ రెడ్డిలపై చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఆత్మహత్యలు పదేళ్ళ తర్వాత రాహుల్‌కు గుర్తుకొచ్చాయా అంటా నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు. ఇక రాయలసీమకు నీరు రావడం ఇష్టంలేని వైఎస్ జగన్‌కు పట్టిసీమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నూతన రాజధానిని నిర్మించడం కూడా జగన్‌కు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరతానని చంద్రబాబు ప్రకటించారు.