శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (08:53 IST)

మీరు ఆవేశపడొద్దు.. బీజేపీపై వ్యతిరేకత లేదు : ఎంపీల భేటీలో చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై గళమెత్తేందుకు అధికార తెలుగుదేశం సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ జరిగిన టీడీపీపీ భేటీ జరిగింది. ఇందులో పలువురు ఎంపీలు తీవ్ర ఆగ్రహావే

కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై గళమెత్తేందుకు అధికార తెలుగుదేశం సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ జరిగిన టీడీపీపీ భేటీ జరిగింది. ఇందులో పలువురు ఎంపీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. ఇప్పటివరకు బీజేపీ చేసింది చాలనీ, ఇక ఓ నమస్కారం పెట్టేసి మనదారి మనం చూసుకుందామనీ వారు సీఎంకు సూచన చేశారు. 
 
ముఖ్యంగా, జేసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ వంటి వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమ పదర్శిస్తోందని, ఇక తాత్సారం చేయకుండా మంత్రి పదవులకు రాజీనామాలు చేసి కేంద్రానికి గుడ్‌బై చెబుదామని పిలుపునిచ్చారు. అలాగే, ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్దామని అవంతి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. 
 
దీంతో సీఎం చంద్రబాబు కల్పించుకుని వారికి అడ్డుకట్ట వేశారు. 'మనకు బీజేపీపై వ్యతిరేకత ఏదీ లేదు. రాష్ట్రానికి రావలసినవి రావడం లేదన్నదే మన ఆవేదన. అవి రాబట్టుకోవడానికి మనం అనేక మార్గాల్లో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తెగతెంపులు ఒక్క నిమిషం పని. కానీ మనది కొత్త రాష్ట్రం. మౌలికవసతులు అభివృద్ధి చేసుకోవాలి. పరిశ్రమలు తెచ్చుకోవాలి. తెంచుకోవడం ద్వారా కాకుండా ఒత్తిడి పెంచడం ద్వారా వాటిని సాధించుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్లు స్పందించకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దామన్నారు. 
 
అలాగే, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు అనేక అంశాల్లో మనపై ఒత్తిళ్లు ఉంటాయి. విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏదో ఒక వైపు మొగ్గాలని నాపై చాలా మంది ఒత్తిడి తెచ్చారు. రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా విభజన చేయాలని డిమాండ్‌ చేశాను. ప్రజలు దానిని ఆమోదించారు. ఒక రాష్ట్రంలో అధికారం ఇచ్చారు. మరో చోట బీజేపీతో కలిపి ఇరవై సీట్లు ఇచ్చారు. నాకు మీ అందరి కంటే ఎక్కువ ఆవేశం ఉంది. నేనొకసారి యుద్ధం మొదలుపెడితే నన్ను ఆపగలిగేవారు ఎవరూ లేరు. కానీ రాష్ట్రం, ప్రజల అవసరాలు చూసి బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకోవాలి అంటూ హితవు పలికారు.