శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 మే 2018 (15:45 IST)

మనమంతా ఐక్యంగా ఉందాం.. బీజేపీకి గుణపాఠం నేర్పుదాం : చంద్రబాబు

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం బెంగుళూరుకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలువురు ప్రాంతీయ పార్టీ నేతతో సమ

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం బెంగుళూరుకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలువురు ప్రాంతీయ పార్టీ నేతతో సమావేశమయ్యారు. అలాగే, తన పిలుపు మేరకు ఇక్కడ భాజాపాకు వ్యతిరేకంగా ఓటు వేసిన తెలుగువారికి కృతజ్ఞతలు తెలిపారు.
 
అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబుకు అక్కడి టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు తన బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం భాజపాయేతర పక్షాలను మద్దతు కోరారు.
 
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లతో చంద్రబాబు బెంగళూరులో భేటి అయ్యారు. వీరితో విడివిడిగా భేటీ అయిన ఆయన.. ప్రాంతీయ పార్టీల బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా, రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు.
 
ఈసందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిణామాలు, భాజపా కుట్ర రాజకీయాలను ఆయా నేతల దృష్టికి తీసుకెళ్లారు. తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను ఆయా నేతలు చంద్రబాబుకు వివరించారు. ప్రాంతీయ పార్టీలన్నీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని మమతాబెనర్జీ బాబుతో అన్నట్లు సమాచారం. కర్ణాటక పరిణామాలే ఇందుకు నాంది కావాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరం ఉందని మాయావతి ప్రస్తావించినట్లు సమచారం.