శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2019 (12:12 IST)

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలి : తమ్మినేని సీతారామ్

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో జాతీయజెండాను ఎగరవేసిన అనంతరం శాసనసభాపతి మీడియాతో మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనుల కారణంగా భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. ఒక్కసారి స్వాతంత్ర్య ఫలితాలను సమీక్షించుకుంటే మనం అభివృద్ధి సాధించామనే చెప్పాలన్నారు. ముందు ముందు మరిన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సూచించారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, మరింత చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు. పెద్దల త్యాగాలు, ఆచరణలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.  గతాన్ని ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నిర్మొహమాటంగా, నిర్కర్షగా పాలన ఉండాలని తెలిపారు. స్వాతంత్ర్య ఫలాలను సమీక్షించి ప్రతి అడుగు ముందుకు వేయాలని కోరారు. కులాలు, మతాలు, జాత్యాహంకారాన్ని రెచ్చగొట్టే అసాంఘీక శక్తులను గమనించి పౌరసమాజం చాలా సంయమనంతో ఉండాలని సూచించారు. 
 
కార్యదీక్షతో, ఐకమత్యంతో కలిసి మెలిసి దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని కాంక్షించారు. స్వాతంత్రదినోత్సవం జరుపుకుంటున్న దేశ, రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ ఫలితాలు అందాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వెల్లడించారు. 
 
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్,  అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇద్దరూ కలిసి అసెంబ్లీ ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.