శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (09:10 IST)

ముందురోజు ప్రియురాలిని చంపేశాడు.. మరుసటి రోజు పెళ్లిపీటలెక్కాడు...

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఓ కసాయి.. మరుసటి రోజు పెళ్లి పీటలెక్కాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వ

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఓ కసాయి.. మరుసటి రోజు పెళ్లి పీటలెక్కాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య కూతురు భార్గవి (23) డిగ్రీ వరకు చదువుకుంది. ఆత్మకూర్‌(ఎం) మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని సత్తయ్య కుమారుడు నరేందర్‌ అలియాస్‌ నరేశ్‌ కొన్నాళ్లు ఓ పెట్రోలు పంపులో పనిచేసి మానేశాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం చివరకు ప్రేమగా దారితీసింది. కులాలు వేరైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
నిజానికి నాలుగేళ్ళ క్రితమే నరేందర్‌కు వివాహమైంది. ఏవో కారణాలు చెప్పి.. పెళ్లయిన 15రోజులకే తొలి భార్యను వదిలించుకున్నాడు. అయినా నరేందర్‌ను భార్గవి నమ్మింది. తనను పెళ్లిచేసుకుంటాడని ఆశించిన ఆమెకు నరేందర్‌ మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమవడం కలిచివేసింది. నరేందర్‌ కుటుంబ సభ్యులు మరో యువతితో ఆదివారం (ఈనెల 4న) పెళ్లిని నిర్ణయించారు. 
 
దీనిపై భార్గవి.. నరేందర్‌ను నిలదీసింది. పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకుందామంటూ నమ్మించిన నరేందర్‌.. శనివారం భార్గవిని బుజిలాపురం సమీపంలోని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి, వ్యవసాయ బావి వద్దగల మొరం కుప్పలో గోతి తవ్వి పూడ్చి వేశాడు. ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి ఆదివారం పెద్దలు కుదిర్చిన యువతి మెడలో తాళికట్టాడు. 
 
భార్గవి తండ్రి లక్ష్మయ్య.. తన కూతురు కనిపించడంలేదని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేందర్‌పైనే ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పెళ్లికి అడ్డుగా ఉండడంతోనే భార్గవిని హత్య చేసినట్టు విచారణలో నరేందర్‌ అంగీకరించాడు. తన వ్యవసాయ బావివద్ద గల మొరంగడ్డ వద్ద గుంతతీసి మృతదేహాన్ని పాతిన ప్రదేశాన్ని చూపెట్టాడు. మంగళవారం పోలీసులు ఆ ప్రదేశంలో తవ్వి భార్గవి మృతదేహాన్ని బయటకు తీశారు.