శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (08:58 IST)

మీ ఇంటికి దోషం పట్టిందంటూ నుదుట కుంకుమ బొట్టుపెట్టారు.. రూ.75 వేలు కొట్టేశారు!

మీ ఇంటికి దోషం పట్టింది.. అమ్మవారి పలుకు ప్రకారం పూజలు చేసి దాన్ని తొలగిస్తామంటూ ఇద్దరు మహిళలు ఏకంగా 75 వేల రూపాయలకు టోకరా వేసిన ఘటన హైదరాబాద్, మాదాపూర్ ఏరియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వి

మీ ఇంటికి దోషం పట్టింది.. అమ్మవారి పలుకు ప్రకారం పూజలు చేసి దాన్ని తొలగిస్తామంటూ ఇద్దరు మహిళలు ఏకంగా 75 వేల రూపాయలకు టోకరా వేసిన ఘటన హైదరాబాద్, మాదాపూర్ ఏరియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మాదాపూర్‌లోని అమర్‌ కో-ఆపరేటివ్‌ ప్రాంతానికి చెందిన శివరాం రెడ్డి అనే పారిశ్రామికవేత్త ఇంటికి సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇద్దరు మహిళలు నుదుట కుంకుమబొట్టు, చేతిలో గంప పట్టుకుని వచ్చారు. వారిని శివరాం రెడ్డి భార్య రూప ఎందుకు వచ్చారని అడిగింది. బోనాల పండుగ సందర్భంగా ప్రసాదం చేయాలని.. బియ్యం, బెల్లం ఇవ్వాలని వారు కోరారు. ఇలా ఇవ్వడం వల్ల మీకు అన్నీ శుభాలే జరుగుతాయని బొట్టు పెట్టారు. 
 
రూప ఇంట్లోకెళ్లి బియ్యం, బెల్లం తీసుకొచ్చింది. ఇంతలో ఇంట్లోని పాపను చూసి.. మీ పాప అనారోగ్యంతో బాధపడుతుందని.. పూజచేసి దిష్టితీయాలని చెప్పారు. నిజంగానే పాప అనారోగ్యంతో ఉండటంతో ఆ ఇద్దరు మహిళల మాటలు నమ్మిన రూప పూజకు వారు చెప్పినట్టే పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. 
 
ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు మహిళలు ఇంట్లో ఎంత డబ్బుంటే అంత పూజలో పెట్టమని చెప్పారు. కుమార్తె ఫీజు కట్టడానికి ఉంచిన రూ.76 వేలు ఓ వస్త్రంలో చుట్టి పూజలో పెట్టింది. డబ్బును కప్‌బోర్డులో పెట్టమని చెప్పారు. తాము వెళ్లిన తర్వాత వస్త్రం విప్పి చూడాలని చెప్పి అపార్ట్‌మెంట్‌ కింది వరకు పసుపునీళ్లు చల్లుకుంటూ వెళ్లిపోయారు. ఆ మహిళలు వెళ్లిపోయిన తర్వాత చూడగా డబ్బు లేదు. మోసపోయామని గ్రహించిన దంపతులు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.