మాజీ ఎయిర్హోస్టెస్ రీతూది హత్యే : భర్త సచిన్ అరెస్టు!
మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూను ఉద్దేశ్యపూర్వకంగానే హత్య చేసినట్టు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఈ కేసులో ఆమె భర్త సచిన్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. భార్యాభర్తల మధ్య ఆదివారం రాత్రి తీవ్రమైన గొడవ జరగడం వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు తేల్చారు.
హైదరాబాదులోని రామంతపూర్ ఇందిరానగర్లోని తమ ఇంట్లో గొడవ సందర్భంగా భర్త సచిన్ ఉప్పల్ తలను నేలకేసి కొట్టడంతో రీతూ సరీన్ (28) మరణించినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని కోఠీలో ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం చేసే సచిన్ ఆదివారం రాత్రి ఇంటికి రాగానే భార్యతో గొడవ పడ్డాడని సమాచారం. వరకట్నం కోసం సచిన్ భార్యను తరుచుగా వేధిస్తూ ఉండేవాడని, ఆ విషయం గురించే ఆదివారం రాత్రి గొడవ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
జంషెడ్పూర్కు చెందిన రీతూ సచిన్ను ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకుంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సోమవారం సచిన్ను అరెస్టు చేశారు. గొడవ జరిగిన సమయంలో సచిన్ మద్యం సేవించి ఉన్నాడా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. తలను నేలకేసి కొట్టడంతో రీతూ మరణించినట్లు అనుమానిస్తున్నారు. రీతూ దేహంపై గాయాలు పెద్దగా లేవు. కానీ లోపలి దెబ్బలతో ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ అసలు కారణం తెలియదని అంటున్నారు.