బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (10:58 IST)

నందమూరి హరికృష్ణ మృతి : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిగ్భ్రాంతి

రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ హీరో నందమూరి హరికృష్ణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలియగానే మంత్రి లోకేశ్‌తో కలసి ఆయన హుటాహుట

రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ హీరో నందమూరి హరికృష్ణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలియగానే మంత్రి లోకేశ్‌తో కలసి ఆయన హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఆ తర్వాత హరికృష్ణ భౌతికకాయం ఉన్న కామినేని ఆస్పత్రికి వెళ్లి నివాళులు అర్పించారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హరికృష్ణ మరణం తమ కుటుంబానికి తీరని లోటని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణం కేవలం టీడీపీకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో హరికృష్ణది అందవేసిన చేయి అని సీఎం అన్నారు. సీనీరంగంతో పాటు రాజకీయాల్లోనే హరికృష్ణ సేవలు ఎనలేనివని బాబు కొనియాడారు. చైతన్యరథం నడుపుతూ నందమూరి తారక రామారావును హరికృష్ణ ప్రజల చేరువకు తీసుకెళ్లారని చంద్రబాబు అన్నారు. హరికృష్ణ ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టుడన్నారు.
 
అలాగే, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. హరికృష్ణ కారుకు జరిగిన ప్రమాదం గురించి తనకు తెలిసిందని, ఆ వెంటనే ఆయన యోగక్షేమాలు తెలుసుకోవాలని పురమాయించానని కానీ, కాసేపటికే ఆయన మరణించారన్న వార్త తెలిసి తట్టుకోలేకపోయానని వ్యాఖ్యానించారు. 
 
కుటుంబ దిక్కును కోల్పోయిన హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన, ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. సినీ రాజకీయాల్లో హరికృష్ణ చేసిన సేవలు మరువలేనివన్న కేసీఆర్, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.