అన్ని సెంటర్లలో సీసీ కెమేరాలు... కిలోమీటరుకో కెమేరా! ఇదీ బాబు విజన్!!
ముఖ్య కూడళ్లలో ప్రతి 500 మీటర్ల దూరానికి ఒక సీసీ కెమేరా ఉండాలి... మిగిలిన ప్రాంతాలలో కిలో మీటరుకు ఒక సీసీ కెమేరా కావాలి... ఇదీ నవ్యాంధ్రలో హైటెక్ సీఎం చంద్రబాబు విజన్. విశాఖలో ఆయన సీసీ కెమేరాల ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ, విశాఖలో నెల రోజుల్లో 1500 సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. నేరాలను అరికట్టడానికి, శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమేరాలు చాలా అవసరమన్నారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆర్కే బీచ్ లోని సందర్శకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.
సందర్శకుడు పోలారావు కుటుంబంతో, బీచ్ ను శుభ్రం చేసే స్వీపర్ నూకరత్నం, వాటర్ పంపింగ్ కార్మికుడు సత్యనారాయణతో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడారు. అనంతరం విశాఖ పాండురంగపురంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కును ప్రారంభించారు. విశాఖ ఎన్టీఆర్ పార్కు అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.
ప్రతి జిల్లాలో ఇటువంటి పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్ర యూనివర్శిటీ కాన్వొకేషన్ హాలులో నీరు-ప్రగతి జిల్లా స్థాయి సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, డా. పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.