శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (03:29 IST)

ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో మట్టిగొట్టుకుపోతాం: అనంత నేతలకు బాబు క్లాసు

మీ పని మీరు చూసుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి తంపులు పెట్టే పనులు చేశారంటే స్థానిక నాయకులను కూడా సంప్రదించకుండా విజయవాడ నుంచే మీ తోకలు కత్తిరిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా టీడీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించారు.

మీ పని మీరు చూసుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి తంపులు పెట్టే పనులు  చేశారంటే స్థానిక నాయకులను కూడా సంప్రదించకుండా విజయవాడ నుంచే మీ తోకలు కత్తిరిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా టీడీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించారు. అనంతపురం టీడీపీ నేతల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఎంపీకి, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకూ మధ్య కూడా తేడాలున్నాయి. అవి ఇలాగే కొనసాగితే ఎవరినీ ఉపేక్షించను. మీరు మారకపోతే ఎలా మార్చాలో నేను ఆలోచిస్తా.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలో లేదో నిర్ణయిస్తా.. ఎన్నిసార్లు చెప్పాలి మీకు.. ఏయ్’ అంటూ సీఎం చంద్రబాబు జిల్లా నేతలకు సీరియస్‌గా క్లాస్‌ తీసుకున్నారు. 
 
అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు జితేంద్రగౌడ్‌, ఈరన్న మినహా మిగతా వారంతా సోమవారం సీఎంతో విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 45 నిమిషాలపాటు వారితో బాబు మాట్లాడారు. ప్రత్యేకంగా పేర్లు ప్రస్తావించకుండానే జిల్లాలో నేతల మధ్య లోపించిన సమన్వయంపై ఆయన మాట్లాడినట్టు సమాచారం. 2019 ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లాలో చాలా నష్టపోతామని హెచ్చరించారు. అంతకుముందే వేగుల ద్వారా సేకరించిన నివేదిక ఆధారంగా చంద్రబాబు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీరియస్‌గా హెచ్చరికలు చేశారు.
 
‘ఒకరి నియోజకవర్గంలో మరొకరు తలదూర్చి నష్టం చేయడానికి ప్రయత్నిస్తే అక్కడి స్థానిక నాయకులతో నిమిత్తం లేకుండా ఇక్కడి నుంచే తోకలు కత్తిరిస్తా..’ అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే గానీ.. ఎంపీ గానీ మరొకరి ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఆలోచించుకోవాలన్నారు. వారు పర్యటించడం పార్టీకి మేలు చేస్తే పర్వాలేదుగానీ.. నష్టం చేసే పరిస్థితులే వస్తే అలాంటి వారికి ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసునన్నారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరినైనా పీకేస్తా.. అని గట్టిగా చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు గానీ, ఇన్‌చార్జిలు గానీ ఇచ్చిన ప్రతిపాదనలన్నీ ఆమోదించి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. పింఛన్లు కూడా అడిగినన్ని ఇస్తున్నామన్నారు. అయినా ఇంకా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడం మంచిది కాదన్నారు.