నేను లేకుంటే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చేది కాదు : చంద్రబాబు
నేను అనేవాడిని లేకుంటే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్కు వచ్చేది కాదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఉత్తరాఖండ్లోని ముస్సోరి లాల్బహదూర్శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐఏఎస్లను ఉద్దేశించి ప్రసంగించారు. సివిల్స్కు పోటీ పడేవారంతా మేధావులైన విద్యార్థులేనని చంద్రబాబు అన్నారు.
ప్రజాసేవ చేయాలనుకునేవారే సివిల్స్కు వస్తారని చెప్పారు. కష్టపడితే డబ్బు సంపాదన పెద్ద విషయమేమీ కాదన్నారు. అటల్ బిహారీ వాజ్పాయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలని తానే సూచించినట్లు చంద్రబాబు తెలిపారు. సెల్ఫోన్లు, ఇంటర్నెట్ వల్ల ఎగుమతులు బాగా పెరిగాయన్నారు.
సముద్ర వనరులను చైనా బాగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత దేశ ప్రజలు నరేంద్ర మోడీకి పూర్తిస్థాయి ఆధిక్యాన్ని ఇచ్చారన్నారు. సింగపూర్, దక్షిణ కొరియా, హాంకాంగ్, చైనా మాత్రమే రెండంకెల వృద్ధి సాధించాయన్నారు. చైనా అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించానని, 33 కి.మీ దూరంలోని విమానాశ్రయానికి 7 నిమిషాల్లో చేరుకుంటున్నారని చెప్పారు.