చిత్తూరు జిల్లా కేంద్రంలో హైటెక్ వ్యభిచారం.. అమ్మాయిలంతా వారే...
జిల్లా కేంద్రమైన చిత్తూరులో వ్యభిచారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగిపోతోంది. అమాయక, నిరుద్యోగ యువతులను ఈ ఊబిలోకి దించి.. హైటెక్ వ్యభిచారాన్ని గుట్టుచప్పుడు కాకుకుండా సాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని సంతపేట, మురకంబట్టు, ప్రశాంత్నగర్, రామ్నగర్ కాలనీ, సత్యనారాయణపురం, మార్కెట్ చౌక్ ప్రాంతాల్లో ఈ హైటెక్ వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతోంది.
ఈ ప్రాంతాల్లో గృహాల్లోనే కాకుండా నగరంలోని పలు ప్రముఖ లాడ్జిలు, గెస్ట్ హౌస్లు, కొన్ని బ్యూటీ పార్లర్లు వ్యభిచార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఈ వ్యభిచార గృహాలకు అవసరమైన అమ్మాయిలను రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి నిరుపేద యువతులను తరలిస్తున్నారు. ఇందుకోసం కొందరు మధ్యవర్తులు ఈ వ్యభిచార గృహాల నిర్వహాకులతో ఒప్పందం కుదుర్చుకుని అమ్మాయిలను సరఫరా చేస్తున్నాయి.
అలాగే, జిల్లాలోని కొన్ని విద్యా సంస్థలకు చెందిన హాస్టల్స్లో ఉండే నిరుపేద అమ్మాయిలను గుర్తించి, వారిని ముగ్గులోకి దించి.. ఈ వ్యభిచార నిర్వాహకులకు అప్పగిస్తున్నారు. మరికొందరి అమ్మాయిలకు అయితే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి తెలివిగా ఈ ఊబిలోకి లాగుతున్నారు. ప్రధానంగా సంతపేట, మురకంబట్టు, ప్రశాంత్నగర్, రామ్నగర్ కాలనీల్లో రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు జిల్లాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. నగరంలోని పలు ప్రధాన కూడళ్ళలో ప్రత్యేక నెట్వర్క్ ద్వారా ఈ తంతు కొనసాగుతోంది. సెల్ ఫోన్ ద్వారా, మధ్యవర్తుల ద్వారా విటులను వ్యభిచార గృహాలకు రప్పించి వేలకువేలు దండుకుంటున్నారు.