బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (17:14 IST)

సోనియా ఫోన్‌ కాల్‌తో వణికిపోయిన ఉద్ధవ్ ఠాక్రే... శివసేన యూ టర్న్

పౌరసత్వ సవరణ బిల్లు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేయించిన ఒక్క ఫోన్‌కాల్ దెబ్బకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వణికిపోయారు. ఫలితంగా ఈ బిల్లుకు మద్దతిచ్చే అంశంపై శివసేన యూటర్న్ తీసుకుంది. తాము లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం వివరణ ఇస్తేనే బిల్లుకు మద్దతు ఇస్తామని లేనిపక్షంలో మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. 
 
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీన్ని విపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ, బీజేపీని విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీల సహకారంతో మహారాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన మాత్రం సమ్మతం తెలిపింది. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమైంది. 
 
ఈ అంశంపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఫోన్ చేయించి లోక్‌సభలో బీజేపీకి మద్దతుపై నిలదీసినట్టు సమాచారం. గుజరాత్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉద్థవ్ ఠాక్రేకి ఫోన్ చేసి మంతనాలు జరిపినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. 
 
ప్రతిపక్ష పార్టీల నిర్ణయానికి విరుద్ధంగా పౌరసత్వం సవరణ బిల్లుకు మద్దతు ఇస్తే.. మహారాష్ట్రలో శివసేనతో పొత్తును తెగతెంపులు చేసుకునేందుకు కూడా తాము సిద్ధమని కాంగ్రెస్ అధినేత్రి తెగేసి చెప్పినట్టు సమాచారం.
 
ఈ నేపథ్యంలోనే నిన్న శివసేన చీఫ్ కొత్త పల్లవి అందుకున్నట్టు కనిపిస్తోంది. 'జాతి ప్రయోజనాల' దృష్ట్యా పౌరసత్వ బిల్లుకు లోక్‌సభలో మద్దతు ఇచ్చామనీ... కానీ తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇంకా జవాబు చెప్పలేదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. 
 
తాము సూచించిన మార్పులు చేయని పక్షంలో ఈ బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇవ్వబోమంటూ ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద సోనియా గాంధీ చేయించిన ఒక్క ఫోన్ కాల్‌తో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వణికిపోయి తమ వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంమ్మీద శివసేన హిందూత్వ వైఖరికి, కాంగ్రెస్ సెక్యులర్ సిద్ధాంతానికి మరోసారి పెద్ద సవాలే ఎదురైనట్టు చెబుతున్నారు.