శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:59 IST)

'స్థానికం' కింద తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ కోటా కింద నాలుగు ఎమ్మెల్యే కోటా, రెండు గవర్నర్ కోటా, ఒక స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ స్థానాలకు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. 
 
బుధవారం అర్థరాత్రి ఎమ్మెల్యే కోటా కింద యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, బీటీ నాయుడు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడుని తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 
 
అలాగే, గవర్నర్‌ కోటాలో శివనాథ్‌ రెడ్డి, శమంతకమణి పేర్లు, విశాఖ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా బుద్ధా నాగ జగదీశ్వర్‌రావు పేరును ఖరారు చేశారు. ఈ అభ్యర్థులంతా గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏడు ఎమ్మెల్సీ పదవులకుగాను నాలుగు స్థానాలను బీసీలకే కేటాయించారు. రెండు స్థానాలు అగ్రవర్ణాలకు చెందిన వారికి దక్కగా కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారికి అవకాశం లభించింది.