శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (18:33 IST)

దారుణం... రఘువీరా పర్యటనలో పావురాలకు తారాజువ్వలు కట్టి నిప్పు....

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏపీ పిసిసీ చీఫ్ రఘువీరా రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో కోవూరు వెళ్లారు. తమ నాయకుడు వస్తున్నాడన్న ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత అత్యుత్సాహం చూపించారు. వాళ్లకు ఓ ఐడియా వచ్చింది. రఘువీరా రెడ్డికి మామూలుగా కాకుండా కాస్త విభిన్నంగా స్వాగతం పలుకాలని నిర్ణయించుకున్నారో ఏమోగానీ వెంటనే పావురాలను పట్టుకొచ్చారు.
 
ఆ పావురాలకు తమ వద్దనున్న తారాజువ్వలను కట్టి వాటికి నిప్పంటించారు. అంతే... తారాజువ్వలతో పాటు పావురాలు గగనంలోకి దూసుకెళ్లిపోయాయి. వాటి ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పావురాలను అలా హింసించి చంపారంటూ మండిపడుతున్నారు. వన్యప్రాణుల చట్టం ప్రకారం ఇలాంటి చర్య తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మరి ఈ దారుణ ఘటన రఘువీరా రెడ్డి దృష్టికి వెళ్లిందో లేదో...?!!