శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (12:37 IST)

టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర... రూ.10 లక్షల సుపారీకి డీల్‌

ఏపీ ప్రభుత్వ విప్‌, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సహా మరో ఇద్దరిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రను ఏలూరు పోలీసులు భగ్నం చేశారు. అలాగే, కుట్రకు పాల్పడిన 9 మందిని అరెస్టు చేశారు. పశ్చి

ఏపీ ప్రభుత్వ విప్‌, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సహా మరో ఇద్దరిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రను ఏలూరు పోలీసులు భగ్నం చేశారు. అలాగే, కుట్రకు పాల్పడిన 9 మందిని అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకెళితే.. ఎమ్మెల్యే ప్రభాకర్‌ ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బ తీస్తున్నారని ఏలూరు రూరల్‌ మండలం వెంకటాపురం గ్రామ మాజీ సర్పంచ్‌, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు కొంత కాలంగా రగిలిపోతున్నారు. 
 
దీంతో ఆయనను హతమార్చేందుకు కొంతమంది కిరాయి రౌడీలతో ఓ డీల్ కుదుర్చుకున్నాడు. ఎమ్మెల్యే ప్రభాకర్‌తోపాటు ఏలూరుకు చెందిన దళిత నేత జిజ్జువరపు జయరాజును హత్య చేసేందుకు ఈ ముఠాను ప్రేరేపించారు. ఇందుకోసం ప్రధాన రౌడీ షీటర్‌, తన అనుచరుడైన యార్లగడ్డ దుర్గారావు అలియాస్‌ పండుతోపాటు మరో 10 మందితో గ్రూపును తయారు చేశారు. దీంతో ఈ ముఠా రెక్కీ నిర్వహించింది.
 
అలాగే, ఎమ్మెల్యే ప్రభాకర్‌ను హత్య చేసేందుకు రూ.10 లక్షలు, జయరాజును హత్య చేసేందుకు మరో రూ.90 వేలు చెల్లించేందుకు డీల్ కుదిరింది. గోపన్నపాలెంలోని ఒక తోటకు ఎమ్మెల్యే ప్రభాకర్‌ తరచూ వచ్చి వెళుతుంటారనీ, అక్కడ అయితే తమ పని సులువు అవుతుందని భావించి చాలాసార్లు కాపు కాశారు. వీలైతే ఒకేరోజు ప్రభాకర్‌తో సహా మిగతా ఇద్దరినీ హతమార్చాలని నిర్ణయించారు. కాగా, ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా వేసిన పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. 
 
దీనిపై ఏలూరు డీఎస్పీ గోగుల వేంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే హత్యకు పన్నిన కుట్రను చేదించాం. రెడ్డి అప్పలనాయుడుతో సహా 9 మందిని అరెస్టు చేశాం అని చెప్పారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. అరెస్టు చేసిన వారికి కోర్టు ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించిందన్నారు.