నేనేమైనా ఉగ్రవాదినా.. పోలీసుల తీరుపై దాసరి ఫైర్.. అరెస్టు చేస్తే జైల్లోనే కూర్చొంటా!
ఏపీ రాష్ట్ర పోలీసులపై దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు మండిపడ్డారు. నేనేమైనా ఉగ్రవాదినా అంటూ ప్రశ్నించారు. తనను అరెస్టు చేస్తే బెయిల్ కూడా తెచ్చుకోనని, జైల్లోనే కూర్చొంటానని హెచ్చరించారు.
కాపులకు రిజర్వేషన్ల కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించేందుకు వెళుతున్న దాసరిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాజమండ్రిలో ఆయన బస చేసిన హోటల్ను చుట్టుముట్టిన పోలీసులు దాసరిని బయటకు అడుగు పెట్టనివ్వలేదు.
దీంతో పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దాసరి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ముద్రగడ నా స్నేహితుడు. ఆయనను పరామర్శిచేందుకు రావడం తప్పా? పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదిలా నన్ను పోలీసులు ట్రీట్ చేశారు. నిన్న రాత్రి నుంచి పోలీసులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా తెచ్చుకోను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ముద్రగడను పరామర్శించి తీరతా' అని దాసరి అన్నారు.