జగన్ కరెక్టే.. బాబు తప్పించుకునే ప్రయత్నం చేశారు: ధర్మాన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైకాపా ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేతగా వైకాపా చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన వంతు బాధ్యతను నిర్వర్తించారని ధర్మాన చెప్పారు.
గురువారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షమే ప్రశ్నిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని ధర్మాన తెలిపారు.
బడ్జెట్లో ఉన్న తప్పులు, లోపాలను ఎత్తి చూపడాన్ని మీరు అంగీకరించలేరా అని బాబును ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నించడానికి అనుభవం కావాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని ధర్మాన సూచించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలకు బడ్జెట్పై స్పష్టత ఇవ్వాలి కానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ధర్మాన చంద్రబాబుకు సూచించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించడం చంద్రబాబుకు తగదని ధర్మాన హితవు పలికారు.