శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (13:00 IST)

13కు దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు తీర్పు వాయిదా : ఎన్.ఐ.ఏ కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ళ కేసులో తుది తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు (ఎన్.ఐ.ఏ స్పెషల్ కోర్టు) వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ళ కేసులో తుది తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు (ఎన్.ఐ.ఏ స్పెషల్ కోర్టు) వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ పేలుళ్లకు ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థ పాల్పడినట్టు ఎన్.ఐ.ఏ దర్యాప్తులో తేలిన విషయం తెల్సిందే. 2013, ఫిబ్రవర్‌ 21న జరిగిన జంట పేలుళ్లలో 19 మంది మరణించగా.. 131 మంది గాయపడ్డారు. 
 
ఈ పేలుళ్లలో ఐఎం సభ్యులు రియాజ్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌ షేక్‌ అనే ఆరుగురు ప్రమేయమున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉండగా.. మిగిలిన వారంతా చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరిపై హత్య, హత్యాయత్నం, కుట్ర అభియోగాలతో పాటు పేలుడు పదార్థాల చట్టం, అసాంఘిక కార్యకలాపాల చట్టం ప్రకారం విచారణ జరిగింది. సుమారు మూడున్నరేళ్ల పాటు సాగిన విచారణ ప్రక్రియలో 157 మంది సాక్షుల వాంగ్మూలాను న్యాయస్థానం నమోదు చేసింది. 502 పత్రాలను 201 వస్తువులను ఆధారాలుగా పరిశీలించారు.
 
కాగా, ఈ కేసులో తుది తీర్పు సోమవారం వెలువడుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. ఇందుకోసం నిందితులను పోలీసులు ఎన్‌ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే తీర్పును డిసెంబర్‌ 13కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.