టీడీపీకి డీకే సమరసింహారెడ్డి రాం.. రాం..!
నడిగడ్డ రాజకీయ ఉద్దండుడు మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీకి బై బై చెప్పేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనకు టికెట్ను కేటాయించకుండా బిజెపికి టికెట్ కేటాయించడం మాట వరుసకు కూడ ఆయనతో చర్చించలేదనే అలకతో సమరసింహారెడ్డి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
గత ఐదు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పార్టీ అధ్యక్షులకు పంపినట్లు ఆయన అనుచరులు తెలిపారు. వలస నాయకులతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి 2013లో సమరసింహారెడ్డి పార్టీలో చేరి కొంత ఉత్సాహాన్ని నింపారు.
సుమారు నెల రోజులపాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళ్లినప్పటికి టికెట్ విషయంలో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది.