శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR

టీడీపీలోకి కాంగ్రెస్ మాజీ మంత్రి డొక్కా.. ముహుర్తం ఖరారు!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పచ్చ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ గురువారు నర్సారావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పిలుపు మేరకు ఆయన చంద్రబాబు చెంతకు చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇందులోభాగంగా ఈనెల 15వ తేదీన టీడీపీ తీర్థం పుచ్చకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
విజయవాడలో జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాల సందర్భంగా నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు శనివారం చంద్రబాబుతో రాయబారం నడిపారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాక కొద్ది రోజులు తన రాజకీయ భవితవ్యంపై స్పష్టత ఇవ్వని డొక్కా ఆ తర్వాత టీడీపీలోకి చేరటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న వైకాపా నేతలు ఆయనకు గాలం వేశాయి. దీంతో జగన్ పార్టీ వైపు మొగ్గుచూపినట్టు వార్తలు రాగా, వీటిని ఆయనే స్వయంగా కొట్టిపారేశారు. దీనికి కారణం ఎంపీ రాయపాటి సాంబశివరావే కారణం. ఈ నేపథ్యంలో రాయపాటి చొరవతీసుకుని డొక్కా పార్టీలోకి రావటం వల్ల కలిగే ప్రయోజనాలను చంద్రబాబుకు వివరించడంతో... సీఎం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.