శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (15:11 IST)

అక్క కుమార్తెను పెళ్లి చేసుకుని అంతం చేసిన కసాయి భర్త

స్వయానా అక్క కుమార్తెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఈ దంపతులు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ, కట్టుకున్న భార్యను అనుమానించాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అక్కసుతో కత్తితో పీకకోసి, మృతదేహాన్ని మూటగట్టి నేలబావిలో పడేశాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కొమిరిశెట్టి యశ్వంతి అలియాస్‌ శాంతి (18) అనే యువతికి వినుకొండకు చెందిన కొమిరిశెట్టి కాళేశ్వరరావుతో గత 2016 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అతడికి ఆమె స్వయానా అక్క కూతురు. ఈ దంపతులు కొంతకాలంపాటు అన్యోన్యంగానే ఉన్నారు. 
 
శాంతికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొంతకాలం కిందట అతడు ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఘర్షణ నేపథ్యంలో సెప్టెంబరు 15వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో కత్తితో భార్య గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతూ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. 
 
ఈ క్రమంలో విఠంరాజుపల్లి సమీపంలోని భగత్‌సింగ్‌ కాలనీలో నివాసముంటున్న తన అన్న బ్రహ్మనాయుడును కాళేశ్వరరావు పిలిచి జరిగిన సంఘటనపై వివరించాడు. శాంతి మృతిచెందిందని నిర్ధారణ కావడంతో సోదరుడు బ్రహ్మనాయుడు, తండ్రి రమణయ్య సహాయంతో మృతదేహాన్ని మూటకట్టి కంచర్ల బాటలోని నేలబావిలో పడవేశాడు. 
 
బావిలో నుంచి దుర్గంధం వ్యాపించడంతో స్థానికులు ఈ నెల 12న పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బావి నుంచి మృతదేహాన్ని వెలికితీసి మహిళ మృతదేహంగా గుర్తించారు. నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు.